Devotional

వినాయకుణ్ణి మట్టితో చేయాలనీ చెప్పుతారు… ఎందుకో తెలుసా?

వినాయకుని విగ్రహాన్ని మట్టితోనే చేయాలని చెప్పేవారు పూర్వీకులు. చెరువుల్లోనూ, కుంటల్లోనో మట్టి తీసుకువచ్చి గణపతి ప్రతిమలు చేయమని చెప్పేవారు. గ్రామపెద్దలు, ఊరి మతపెద్దలు వర్షాకాలానికి ముందే సమావేశమై మట్టి విగ్రహాల గురించి ఓ నిర్ణయం తీసుకునేవారు. ఊర్లోని ఆసక్తికల యువకులను , ఇతరులను ఎంచుకుని మట్టి ప్రతిమలు చేసే పనిని పురమాయించేవారు. అంతే, యువశక్తి ముందు కదులుతుంది.చెరువుల్లోనూ, కుంటల్లోనూ మట్టి తవ్విప్రోగేసేవారు. వానాకాలం ఇంకా రాలేదు కనుక మట్టి తవ్వితీయడం చాలా సులువు. అలా ఒక క్రమపద్దతిలో మట్టి తీయడంతో కాలవులు, కుంటలు, చెరువుల్లో నీటినిలువ సామర్థ్యం పెరిగేది. అంటే వినాయకుని ప్రతిమల తయారీ వెనుక, చెరువులు, కాల్వల పూడికతీత పనులే అంతరార్థంగా ఉన్నదన్నమాట.

వానాకాలం ముందే పూడికతీత పనులు పూర్తయితే, ఆ తర్వాత వానలు పడ్డప్పుడు చెరువులు, కుంటల్లో నీళ్లు ఎక్కువగా నిల్వఉండేవి. నీటి నిల్వ సామర్థ్యం పెరిగేది. ఇలా నిలిచిన నీటిలో అధికభాగం ఆ ఊరి వ్యవసాయానికి, త్రాగునీటికీ, ఇతర అవసరాలకు ఉపయోగపడేది. పైగా, మట్టి వినాయకుల తయారీ వల్ల పూడికతీత పనులు కూడా పూర్తికావడంతో సహజంగానే భూగర్భజల మట్టం పెరిగేది.

చెరువులు, కుంటల్లోని నీరు క్రమంగా భూమిలోకి ఇంకడంతో ఇరుగుపొరుగు గ్రామాల్లోకూడా భూగర్భజలం సంవృద్ధిగా ఉండేది. తద్వారా ఎండాకాలంలో చెర్వులు, కుంటలు ఎండిపోయినా, భూగర్భజలమట్టం పెరగిన కారణంగా బావుల్లో నీరు ఉండేది.ఇంతటి పరమార్థం మట్టివినాయకుల తయారీ కింద మనవాళ్లు ఇమిడ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మట్టివినాయకుల తయారీ జలయజ్ఞంలో అంతర్భాగమేనన్నమాట.