టాలీవుడ్లో చక్రం తిప్పి.. ఇప్పుడు కనబడని 10 మంది హీరోలు
Tollywood Heroes:ఒకప్పుడు తెలుగులో టాప్ లేపేసిన కొందరు హీరోలు ఇప్పుడు తెరమరుగయ్యారు. ఎంతగా అంటే, కనీసం వాళ్ల జాడ కూడా తెలియడం లేదు. అసలు వాళ్లెక్కడున్నారో కూడా తెలియదు.. ప్రేక్షకులు కూడా వాళ్ల గురించి పూర్తిగా మరిచిపోయారు. మరి అలాంటి వాళ్ళల్లో కొందరు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.
తరుణ్ టాలీవుడ్లో ఒకప్ప డు అసలు లవర్ బాయ్ అనే పదానికి పర్ఫెక్ట్ నిదర్శనం. మిలినియం మొదట్లోనే నువ్వే కావాలి అంటూ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. బాలనటుడిగానే ఎన్నో సంచలనాలు సృష్టించి, హీరోగా కూడా రచ్చ చేసాడు. నువ్వే కావాలి తర్వాత ప్రియమైన నీకు, నువ్వులేక నేనులేను, నువ్వే నువ్వే లాంటి సినిమాలతో విజయ శిఖరాలు చేరాడు. ఆ తర్వాత మెల్లగా ఫేడవుట్ అయిపోయిన తరుణ్ గురించి ఇప్పటివాళ్ళకి తెలీదు.
1990ల్లో జెడి చక్రవర్తి సినిమాలు జనం ఎగబడి చూసేవాళ్లు. శివ సినిమాలో విలన్గా ఎంట్రీ ఇచ్చినా కూడా ఆ తర్వాత హీరో అయిపోయి సంచలనం సృష్టించాడు. గులాబీ, ప్రేమకు వేళాయెరా, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా ఇలా చాలా సినిమాల్లో నటించాడు. హిందీలో కూడా సత్య లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం అస్సలు కనిపించలేదు.
ఇక 90ల చివర్లో స్వయంవరం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన హీరో వేణు తొట్టెంపూడి. తొలి సినిమాతోనే సంచలన విజయం అందుకున్నాడు. తర్వాత కళ్యాణ రాముడు, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే లాంటి సినిమాల తో సక్సెస్ ఫుల్ హీరో అయ్యాడు. అప్పట్లో క్రేజీ హీరోగా కొన్నేళ్ల పాటు వరస సినిమాలు చేసిన వేణు.. ఆ తర్వాత పూర్తిగా దూరమైపోయాడు. ఆమధ్య బోయపాటి తెరకెక్కించిన దమ్ము సినిమాలో ఎన్టీఆర్ బావ మరిదిగా కనిపించిన వేణు ఆతర్వాత జాడలేదు.
హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమా లతో అప్పట్లో యూత్ ఐకాన్ గా మారిన వరుణ్ సందేశ్. ఇప్పుడు పూర్తిగా మాయమైపోయాడు. తర్వాత 20 సినిమాలు చేసినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో బిగ్ బాస్ 3కి భార్యతో సహా వచ్చాడు. అయినా మార్పులేదు.
డైరెక్టర్ తేజ స్కూల్ నుంచి వచ్చి కూడా నవదీప్ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు . చందమామ, గౌతమ్ SSC లాంటి సినిమాలు పర్లేదనిపించి, హీరోగా దాదాపు 15 సినిమాలకు పైగా చేసిన లక్కులేదు. ప్రస్తుతం కారెక్టర్ ఆర్టిస్టుగా కాలం గడిపేస్తున్నాడు.
ఉదయ్ కిరణ్ మాదిరే హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి వచ్చిన రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్ సినిమాలతో విజయాలు అందుకుని మంచి క్రేజ్ కొట్టేసాడు. ఆ తర్వాత వరస ఫ్లాపులతో తన కెరీర్ చేతులారా పాడు చేసుకున్నాడు. ఇక మధ్య విడుదలైన ఇద్దరి లోకం ఒకటే సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా లేవు. రాజ్ తరుణ్ ప్రస్తుతం పూర్తిగా ఫేడవుట్ స్టేజీకి వచ్చేసాడు. ఒరేయ్ బుజ్జిగా మూవీ రిలీజ్ కి రెడీ గా వుంది.
90ల్లో 6 టీన్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసాడు. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో చిరంజీవితో కూడా కలిసి నటించాడు. ఆ తర్వాత నేను సీతామాలక్ష్మి, రత్నం, గాళ్ ఫ్రెండ్, అనగనగా ఓ కుర్రాడు లాంటి సినిమాలు చేసాడు. కొన్నాళ్ల పాటు తెలుగులో వరస సినిమాలు చేసి, ఇప్పుడు బిజినెస్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు.
1990ల్లో తండ్రి వడ్డే రమేష్ నిర్మాత కావడంతో ఇండస్ట్రీకి ఎంట్రీ పాస్ ఈజీగానే తెలుగు ఇండస్ట్రీలో కి వచ్చిన వడ్డే నవీన్ వరస విజయాలతో దూసుకుపోయాడు . కోరుకున్న ప్రియుడు, పెళ్లి, మనసిచ్చి చూడుతో పాటు ఇంకా ఎన్నో సంచలన విజయాలు అందుకున్నాడు. రవితేజ లాంటి స్టార్ హీరో కూడా ఒకప్పుడు ఈయన సినిమాల్లో అసిస్టెంట్గా నటించాడు. కానీ 2000 తర్వాత వడ్డే నవీన్ పూర్తిగా దూరమయ్యాడు.
హీరో శివ బాలాజి ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించి, తర్వాత దాదాపు 10 సినిమాలు హీరోగా చేసినా విజయాలు మాత్రం రాలేదు. చందమామ మాత్రం పర్లేదనిపించింది. దాంతో పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. బిగ్ బాస్ తొలి సీజన్ విన్నరయ్యాక కూడా ఈయనకు పెద్దగా కలిసిరాలేదు.
తనీష్ బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేసి,రవిబాబు తెరకెక్కించిన నచ్చావులే సినిమాతో హీరో అయ్యాడు. రైడ్ సినిమాతో హిట్ కూడా అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం కనిపించకుండా పోయాడు. విలన్ పాత్రలు కూడా చేయడానికి రెడీ అయినా కూడా కాలం కలిసిరాలేదు. బిగ్ బాస్ 2 తర్వాత అడపాదడపా షోలు చేస్తున్నాడు.