Banana: అరటిపండులో నల్ల మచ్చలు ఉంటే తినవచ్చా? అలా తింటే ఏమవుతుంది?
Black Spot Bananas details: తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు అందించే అరటిపండు అంటే మనలో చాలా మంది చాలా ఇష్టంగా తింటుంటారు. కొంతమంది అరటిపండును బాగా పండితే తినటానికి ఇష్టపడరు. బాగా పండిన అరటి పండు తొక్క పై నల్లని మచ్చలు వస్తాయి. దాంతో ఈ పండును తినడానికి కాస్త ఆసక్తి చూపరు. అయితే ఈ అరటి పండ్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బాగా పండిన అరటి పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. జీర్ణాశయం, పేగులో పుండ్లు, అల్సర్ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ అరటి పండ్లు తింటే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ అరటి పండ్లు తింటే అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి తగ్గి తక్షణ శక్తి లభిస్తుంది.
ఈ మధ్యకాలంలో చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి వారు రాత్రి సమయంలో పడుకోవడానికి అరగంట ముందు రెండు అరటి పండ్లను తింటే మలబద్ధకం సమస్య నుంచి బయట పడతారు. అరటి పండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. బాగా పండిన అరటి పండ్లలో ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది.
ఇది మన శరీరంలో సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. చక్కగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి కూడా బయట పడవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉండుట వలన రక్తపోటు కూడా నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
అరటిపండ్లు పూర్తిగా పండినప్పుడు అధిక యాంటీఆక్సిడెంట్ కలిగి ఉంటుంది. ఇది వైరస్లు, క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మచ్చలు ఉన్నా బాగా పండిన అరటి పండును తినటానికి ప్రయత్నం చేసి దానిలో ఉన్న ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.